Karnataka: పెళ్లికూతురు బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయిందని, చెల్లెలితో వివాహం తలపెట్టగా, ప్రియురాలితో పారిపోయిన వరుడు!

  • పెళ్లి సమయానికని కనిపించకుండా పోయిన వధువు
  • వెంటనే ఆమె చెల్లితో నిశ్చితార్థం జరిపించిన బంధువులు
  • ఆపై చెప్పా పెట్టకుండా పారిపోయిన వరుడు

ఇదొక వింతైన వార్త... పెళ్లికూతురు ఎవరితోనో వెళ్లిపోయిందని మగ పెళ్లివాళ్లు గొడవ చేస్తుంటే, వధువు చెల్లెలిని పెళ్లి కూతురిని చేయగా, వరుడు పారిపోయిన ఘటన ఇది. ఏపీ సరిహద్దులకు దగ్గరగా వుండే కర్ణాటకలోని కోలారు జిల్లా చిన్నకల్లులో ఇది జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గురేష్ అనే వరుడికి సౌమ్య అనే వధువుకు వివాహం నిశ్చయమైంది. శనివారం నాడు రిసెప్షన్ జరిపి, ఆదివారం పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. బంధుమిత్రులు, ఇరు వర్గాల పెళ్లివారు పెళ్లిని వైభవంగా జరిపించేందుకు సిద్ధమయ్యారు.

అయితే, వివాహ ముహూర్తానికి సమయం మించిపోతున్నా పెళ్లి కూతురు మండపానికి రాలేదు. ఆమె తన ప్రియుడితో కలసి చెక్కేసినట్టు తెలుసుకున్న వరుడి తరఫు బంధువులు ఆగ్రహించగా, పెద్దలు సర్ది చెప్పి, సౌమ్య బాబాయి కుమార్తె వెంకటరత్నమ్మతో గురేష్ పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. నిశ్చితార్థాన్ని అప్పటికప్పుడు ముగించేశారు.

మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి వుండగా, షేవింగ్ చేయించుకుని వస్తానని బయటకు వెళ్లిన గురేష్ తిరిగి రాలేదు సరికదా... తన ఫోన్ ను కూడా స్విచ్చాఫ్ చేశాడు. దీంతో మరింత గందరగోళం ఏర్పడగా, పెళ్లివచ్చిన వారంతా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అతను తన ప్రియురాలి కోసం వెళ్లిపోయాడని కొందరు, పెళ్లి ఇష్టం లేక పారిపోయాడని మరికొందరు వ్యాఖ్యానించారు.

More Telugu News