malala: ఇండియా అంటే ఇష్టం.. భారత్ పర్యటనకు వస్తా!: మలాలా

  • భారత్ లో పర్యటించాలని వుంది 
  • ఆ బాలిక రాసిన లేఖ నా హృదయాన్ని తాకింది 
  • భవిష్యత్తులో పాకిస్ధాన్ ప్రధానినవుతా 

భారత్ పర్యటనకు రావాలని ఉందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్ యువతి మలాలా యూసుఫ్ జాయ్ ఆకాంక్ష వ్యక్తం చేసింది.  డబ్ల్యూఈఎఫ్ లో పాల్గొన్న సందర్భంగా దావోస్ లో ఆమె మాట్లాడుతూ, భారత్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని చెప్పింది. తనకు మద్దతిస్తూ ఉత్తరం రాసిన ఓ భారతీయ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధాన మంత్రినవుతానని పేర్కొందని గుర్తు చేసుకుంది.

నేటి బాలికల ఉన్నత ఆశయాలకు నిదర్శనంగా నిలిచిన ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని తెలిపింది. భవిష్యత్తులో తాను పాకిస్ధాన్ ప్రధానినై, తమ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని మలాలా ఆశాభావం వ్యక్తం చేసింది. తన పోరాటం భారత్ లోని బాలికల కోసం కూడా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసింది. భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువవద్దని ఆమె సూచించింది. బాలికలకు కేవలం విద్యనందిస్తే సరిపోదన్న ఆమె, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించింది.

More Telugu News