Telugudesam: టీడీపీని వీడే ప్రశ్నేలేదు: స్పష్టం చేసిన నామా, సండ్ర

  • మోత్కుపల్లి అలా అనడం సరికాదు
  • ఎంపీగా ఉండగా 2.64 లక్షల సంతకాలు చేశాను
  • 14 ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నాను

టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయమంటూ ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలు స్పందించారు. పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, టీడీపీని వీడే ప్రశ్నేలేదని తెలిపారు. గత 14 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని అన్నారు.

ఎంపీగా ఉండగా 2.64 లక్షల సంతకాలు చేసి, 1.20లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు, 60వేల మందికి రైల్వే పాస్‌ లు ఇచ్చానని తెలిపారు. తాను చేసినన్ని పర్యటనలు ఎవరూ చేయలేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీ సెంట్రల్‌ కమిటీ ఉపాధ్యక్షుడు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, పల్లెపల్లెకూ టీడీపీ పేరుతో అన్ని మండలాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తుంటే, పార్టీ మారతారంటూ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారే ప్రశ్నేలేదని ఆయన తెలిపారు. మోత్కుపల్లి అలా పేర్కొనడం సరికాదని ఆయన హితవు పలికారు. 

More Telugu News