Chandrababu: మేము కూడా మిత్ర ధర్మమే పాటిస్తున్నాం: సోము వీర్రాజు

  • సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత
  • కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీ అభివృద్ధి చెందుతోంది
  • ఈ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేసినట్టు చెప్పుకుంటోంది
  • రాష్ట్రంలో నిధుల సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి: వీర్రాజు

పొత్తు వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామని, మిత్రధర్మం పాటిస్తున్నామని బీజేపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబునాయుడు నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ, తాము కూడా మిత్ర ధర్మమే పాటిస్తున్నామని, టీడీపీయే పాటించడం లేదంటూ కౌంటరిచ్చారు. విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీ అభివృద్ధి చెందుతున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఈ అభివృద్ధిని తాము చేసినట్టుగా టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని, రాష్ట్రంలో నిధుల సేకరణపై సీఎం చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  చేసిన మోసాన్ని తాము మర్చిపోలేమంటూ సోము వీర్రాజు మండిపడ్డారు.

More Telugu News