teacher: హోంవర్క్‌ చేయలేదని.. తోటి విద్యార్థులతో బాలికను చెంపదెబ్బలు కొట్టించిన ఉపాధ్యాయుడు!

  • మధ్యప్రదేశ్‌లోని థండ్ల పట్టణంలో ఘటన
  • ఆరు రోజుల్లో 168 చెంపదెబ్బలు తిన్న 12 ఏళ్ల విద్యార్థిని
  • స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతోన్న వైనం
  • పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లోని థండ్ల పట్టణంలో ఉన్న ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల విద్యార్థిని హోం వర్క్‌ చేయలేదన్న కారణంతో తోటి విద్యార్థుల చేత ఉపాధ్యాయుడు మొత్తం 168 చెంపదెబ్బలు కొట్టించాడు. ఈ విషయంపై ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా అది సరైందే అన్నట్లు మాట్లాడారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త మీడియా దృష్టికి వచ్చింది.

మరిన్ని వివరాలు చూస్తే...  హోం వర్కు చేయని ఆ బాలికను ఆరు రోజుల పాటు 14 మంది విద్యార్థులు చెంపదెబ్బలు కొట్టాలని ఉపాధ్యాయుడు మనోజ్‌కుమార్ ఆదేశించాడు. అతడి సూచనను పాటిస్తూ జనవరి 11 నుంచి 16 వరకు ఆమెను తోటి విద్యార్థులు ఒక్కొక్కరు రోజుకు రెండు సార్లు చొప్పున చెంపదెబ్బలు కొట్టారు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక స్కూలుకి వెళ్లనని తన తండ్రితో చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News