Kathi Mahesh: పవన్ అభిమానులు-కత్తి మహేశ్ మధ్య వివాదం ముగిసినట్టే.. థ్యాంక్స్ చెప్పిన కోన వెంకట్!

  • ‘మహాన్యూస్’లో కుదిరిన రాజీ
  • అటునుంచి అటే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు ఉపసంహరణ
  • ఇంకెవరూ కత్తివైపు చూడరన్న కోన వెంకట్
  • కెరీర్ బాగుండాలంటూ ట్వీట్

తనపై గుడ్లదాడికి పాల్పడిన వారిపై పెట్టిన  కేసును ఉపసంహరించుకున్న మహేశ్  కత్తికి సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో మహేశ్ కత్తి ఫొటో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ‘‘వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు ముందుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నిన్ను ఎవరూ దూషించరు, నీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారు పవన్‌కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ కత్తితో ‘మహాన్యూస్’ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పవన్ అభిమానులు-మహేశ్ కత్తికి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో స్టూడియో నుంచి నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవన్‌ అభిమానులపై పెట్టిన కేసును కత్తి ఉపసంహరించుకున్నారు. అనంతరం పవన్ అభిమానులు, మహేశ్ కత్తి కలిసి ఫిలింనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది.

కత్తి మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం కానీ, కక్ష కానీ లేవని పేర్కొన్నాడు. కాగా, పవన్ అభిమానులు-మహేశ్ కత్తి మధ్య సయోధ్య కుదిరినందుకు ఇటు టాలీవుడ్‌తో పాటు పవన్ అభిమానులు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇంతటితో ముగిసినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News