kathi mahesh: 'కత్తి మహేశ్ పై కోడిగుడ్లు విసిరింది మేమే!' అంటూ.. టీవీ స్టూడియోకి వచ్చిన ఇద్దరు యువకులు!

  • కోడిగుడ్లు విసిరింది మేమే నంటూ ‘టీవీ9’ స్టూడియోకి వెళ్లిన ఇధ్దరు యువకులు
  • పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ వ్యాఖ్యలను భరించలేకపోయాం
  • మా నిరసన తెలిపేందుకే ఇలా చేశామంటున్న యువకులు

ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ పై నిన్నరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. తనపై దాడి చేసింది పవన్ కల్యాణ్ అభిమానులేనంటూ పోలీసులకు కత్తి మహేశ్ ఫిర్యాదు చేశారు. కాగా, ఈ దాడి తామే చేశామంటూ ఇద్దరు యువకులు ‘టీవీ9’ స్టూడియోకి వెళ్లారు. అసలు, ఈ దాడి చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలతో తాము మనోవేదనకు గురయ్యామని చెప్పారు. కొన్ని రోజులుగా కత్తి మహేశ్ ను కలిసేందుకు తాము ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని అన్నారు.

 సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ అయిన తర్వాత కత్తి మహేశ్ ని కలిసేందుకు యత్నించామని, అయితే పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆరోజున ఆయన కారు బయటకు వచ్చిన తర్వాత  కత్తి మహేశ్ కారు వెనుక ఫాలో అయ్యామని.. తాజ్ కృష్ణ హోటల్ సిగ్నల్ వద్ద ఆయన కారు ఆపామని.. ‘రెండు నిమిషాలు మాట్లాడతం సార్!’ అని ఆయనతో అంటే, కత్తి మహేశ్ కుదరదంటూ తన తల ఊపారని అన్నారు.

మా తప్పేమన్న ఉంటే క్షమాపణ చెబుతామని.. ఆయన తప్పేమన్న ఉంటే కత్తి మహేశ్ క్షమాపణలు చెప్పాలని అడుగుదామని అనుకున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ తనకు క్షమాపణలు చెప్పాలని కత్తి మహేశ్ డిమాండ్ చేయడం అసంబద్ధమని అన్నారు. నిన్న రాత్రి కత్తి మహేశ్ పై కోడిగుడ్లతో దాడి చేసింది తామేనని, కేవలం, తమ నిరసన తెలిపేందుకే ఈ విధంగా చేశామని చెప్పుకొచ్చారు.

More Telugu News