Haryana: అత్యాచారాలకు అడ్డాగా హరియాణా.. నాలుగు రోజుల్లో ఆరు కేసులు.. తాజాగా కాలేజీ విద్యార్థినిపై..!

  • హరియాణాలో రెచ్చిపోతున్న కామాంధులు
  • రోడ్డుపై అమ్మాయి కనిపిస్తే కిడ్నాప్, రేప్
  • దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు 

అత్యాచారాలకు హరియాణా అడ్డాగా మారుతోంది. నాలుగు రోజుల్లో వరుసగా ఇటువంటి ఆరు ఘటనలు జరగ్గా తాజాగా ఓ కాలేజీ విద్యార్థినిపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఇంటికెళ్తున్న విద్యార్థినిని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బలవంతంగా కారులోకి ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గురుగ్రామ్‌లోని ఫరూఖ్‌నగర్‌లో ఈ ఘటన జరగ్గా ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. జరిగిన ఘోరాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజల్లో జరిగిన ఆరో ఘటన ఇది.

జనవరి 13న జరిగిన తొలి ఘటనలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అనంతరం ఆమెను జింద్‌లోని ఓ కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. మరో నిర్భయగా చెబుతున్న ఈ ఘటనలో ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా,  తనను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన యువకులు ముషైద్‌పూర్ గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత తన దుస్తులు కూడా తీసుకున్నారని బాలిక పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పనని ప్రాధేయపడిన తర్వాతే తనకు దుస్తులు ఇచ్చారని వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News