Cenchurian: మా ఘోర ఓటమికి కారణమిదే: విరాట్ కోహ్లీ

  • రెండో టెస్టులో వైఫల్యంపై కోహ్లీ స్పందన
  • చక్కగా రాణించిన బౌలర్లు
  • బ్యాట్స్ మెన్ వైఫల్యంతోనే ఓటమి
  • ఫీల్డింగ్ లోపాలు కూడా కొంపముంచాయన్న కోహ్లీ

సౌతాఫ్రికాలోని సెంచూరియన్ మైదానంలో నిన్న రెండో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం పాలవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. బౌలర్లు చక్కగా రాణించినప్పటికీ, బ్యాట్స్ మెన్ వైఫల్యమే ఓటమికి కారణమైందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆట చివరకు ఓ జట్టు ఓడిపోవాల్సిందేనని, అయితే, ఈ తరహా ఓటమి మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. జట్టుగా ఎప్పుడూ విజయం సాధించేందుకే కృషి చేస్తుంటామని, మ్యాచ్ లో మంచి అవకాశాలను ఫీల్డర్లు వదిలేశారని ఆరోపించిన కోహ్లీ, ఎంతో కష్టపడి మంచి స్థితికి బౌలర్లు తీసుకువస్తే స్వీయ తప్పిదాలతో మ్యాచ్ ని బ్యాట్స్ మెన్ దూరం చేశారని ఆరోపించాడు.

 తొలి మ్యాచ్ లో చేసిన తప్పులే రెండో మ్యాచ్ లోనూ జరిగాయని, దీనిపై ఆటగాళ్లు ఎవరికి వారు తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నాడు. ఈ తరహా ఆట ఆడేందుకు ఇక్కడికి వచ్చామని తానేమీ అనుకోవడం లేదని, కేవలం 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యాలతో టెస్టు మ్యాచ్ లో విజయం సాధ్యం కాదన్న విషయాన్ని ఆటగాళ్లు గుర్తెరగాలని అన్నాడు. భాగస్వామ్యాలను సెంచరీ దాటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

More Telugu News