Chandrababu: చంద్రబాబు దోచుకోవడానికి ఓ ఆయుధం ‘పోలవరం’!: వైసీపీ నేత పార్థసారధి

  • ‘పోలవరం’ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న బాబు
  • ‘పోలవరం’ప్రాజెక్టు అంచనాలను నేడు 58 వేల కోట్లకు పెంచేశారు
  • చంద్రబాబు చేస్తున్నది ధన దోపిడీనా? ధన యజ్ఞమా?: పార్థసారధి ఆరోపణలు

ఏపీ సీఎం చంద్రబాబు దోచుకోవడానికి ఓ ఆయుధం పోలవరం ప్రాజెక్టు అని వైసీపీ నేత పార్థసారధి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బంగారు గుడ్లు పెట్టే బాతు’ సామెత లాగా గుడ్లన్నిటినీ ఒకేసారి మింగేయాలని చూస్తున్న చంద్రబాబునాయుడు, ఈ ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరారు.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి జరగని పనులు జరిగినట్టు, ఎడ్ హాక్ పేమెంట్స్ పేరిట తన కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించి, వాటిని మళ్లీ వేరే మార్గంలో చంద్రబాబు తీసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ‘పోలవరం’పై ఓ లేఖ ఇచ్చారని, అందులో అంచనాలు విపరీతంగా పెంచేశారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ పనులను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పక్కన పెడుతున్నారని, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన చంద్రబాబు, దోపిడీకి కొత్త అర్థాలు చెబుతున్నారని అన్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం పదివేల కోట్లతో ప్రారంభించిన ‘పోలవరం’ప్రాజెక్టు అంచనాలను నేడు 58 వేల కోట్లకు పెంచిన చంద్రబాబునాయుడు చేస్తున్నది ధన దోపిడీనా? ధన యజ్ఞమా? అనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని అన్నారు.

More Telugu News