kcr: మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం: సీఎం కేసీఆర్

  • కొత్త పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై సుదీర్ఘ చర్చ
  • సమగ్ర భూ ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాల విశ్లేషణ
  • కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రిని ఆహ్వానిస్తాం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకే రోజు కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై ప్రగతి భవన్ లో దాదాపు 8 గంటల పాటు శనివారం సుదీర్ఘ సమీక్ష జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించిన సమగ్ర భూ ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను ఈ సమావేశంలో విశ్లేషించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం తర్వాత భూమి వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని, ఈ వివరాలతో కూడిన పాస్ పుస్తకాలు కొత్తగా ప్రింట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవే వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచుతామని అన్నారు.

కోర్ బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్ సైట్ నిర్వహిస్తామని, దీనికి ‘ధరణి’ అనే పేరును ఖరారు చేసినట్టు చెప్పారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నామని, పూర్తి స్థాయి సంస్కరణలతో వస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని మార్చి 11 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. అదే రోజు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడానికి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం చెప్పారు.
 
తెలంగాణ భూ భాగం వివరాలు :

తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం : 1,12,077 చదరపు కిలోమీటర్లు  
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం భూభాగం : 2.80 కోట్ల ఎకరాలు
ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి : 1.42 కోట్ల ఎకరాలు
కోర్టు కేసులు, వివాదాలు, చిక్కులు కలిగిన భూములు :17.89 లక్షల ఎకరాలు
రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు : 11.95 లక్షల ఎకరాలు
చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వే లైన్లు, సబ్ స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూములు, కోర్టు కేసుల్లోని అటవీభూములు: 84.00 లక్షల ఎకరాలు
నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీభూమి: 24 లక్షల ఎకరాలు :

‘పార్ట్ ఎ’ విజయవంతం, త్వరలో ‘పార్ట్ బి’ :


తెలంగాణ వ్యాప్తంగా వందరోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన ‘పార్ట్ ఎ’ విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90 శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, ఏ భూమికి ఎవరు యజమానో తేలిందని చెప్పారు. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తామని సిఎం చెప్పారు.

కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను పార్ట్ బిలో పరిష్కరిస్తామన్నారు. ‘పార్ట్ బి’ చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం ‘పార్ట్ బి’ ప్రక్షాళన కూడా నిర్వహిస్తామని చెప్పారు. ‘పార్ట్ ఎ’ ద్వారా లెక్కతేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలు ఉన్నాయని, వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు.

కోర్ బ్యాంకింగ్ తరహాలో ‘ధరణి’ నిర్వహణ:


రాష్ట్రంలోని ప్రతీ ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల వెబ్ సైట్ ‘ధరణి’ని కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దీని కోసం ప్రత్యేకంగా ఐటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ ధరణిలో నమోదు అవుతాయని, మండల కార్యాలయం నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఈ వెబ్ సైట్ నుంచి వివరాలు తీసుకోవచ్చని అన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చని వెల్లడించారు.

ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు:

రైతులు, ఇతర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలు, 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిని యథావిధిగా కొనసాగించనున్నారు. ఈ 141 సబ్ రిజిస్ట్రార్ల పరిధి వారి కార్యాలయం ఉన్న మండలానికే పరిమితం అవుతుంది. మిగతా 443 చోట్ల ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తారు. ఎమ్మార్వోలు తామిచ్చిన అపాయింట్ మెంట్ తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మార్వోలు హాజరుకాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగిస్తారు.

అవినీతి, నకిలీలు, ఇబ్బంది తొలగించడమే లక్ష్యం:

భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘రైతులు, ఇతర ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలని, కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రావాలని, పాస్ పుస్తకం వారి ఇంటికే కొరియర్ ద్వారా చేరాలని అన్నారు. ఎవరి వద్దకూ వెళ్లకుండానే తమ పని ఒక్కరోజులోనే పూర్తి కావాలని, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలని ఆదేశించారు.

నూటికి నూరుశాతం పారదర్శకంగా పనులు జరగాలి. నకిలీ పాసుపుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించడం పరిపాటి అయిందని, నకిలీ పాసుపుస్తకాల ద్వారా రుణాలు పొంది ప్రభుత్వాన్ని కూడా మోసం చేసిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. ఇకపై అలా సాధ్యం కాదని,. భూ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తుందని, అందుకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నామని, ప్రతీ విషయం ‘ధరణి’లో నమోదవుతుందని చెప్పారు.

ప్రతిపాదిత నూతన రిజిస్ట్రేషన్ విధానం :

* అమ్మే వారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ను అపాయింట్ మెంట్ టైమ్ అడగాలి. (పాస్ పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్ల్ మాదిరిగా)

* భూమి అమ్మకానికి సంబంధించిన డాక్యుమెంటు తయారు చేయడానికి లైసెన్స్ డ్
డాక్యుమెంటు రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వుంటారు. వారు ఫీజు తీసుకుని రాసిన కాగితాలను అనుమతిస్తారు.  

* అమ్మేవారు/కొనేవారు తామే స్వయంగా డాక్యుమెంటు రాసుకున్నా అనుమతిస్తారు. దీని కోసం వారికి సంబంధిత ఫారాలు/టెంప్లేట్స్ అందుబాటులో ఉంచుతారు.  

* అపాయింట్ మెంట్ ఇచ్చిన తేదీ/సమయానికి అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ తమ పాస్ పుస్తకాలతో సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి.

* బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు.
ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్ రిజిస్ట్రార్ తొలగిస్తారు. అదే సమయంలో కొన్న వారి పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి, సంతకం చేస్తారు.

* భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు.

* ఇద్దరి పాస్ పుస్తకాలను అదే రోజు అదే సమయంలో ఎమ్మార్వోకు పంపుతారు.

* సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరుపై మార్పిడి(మ్యుటేషన్)  చేస్తారు.

* ఈ వివరాలను ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు.

*ఎమ్మార్వో కార్యాలయంలోని ఐటి అధికారికి ఈ వివరాలు పంపాలి.  ఐటి అధికారి ఆ వివరాలను వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తారు.

* వెబ్ సైటులో నమోదైన వివరాలు కొన్న వారికి, అమ్మిన వారికి వెంటనే ఎస్.ఎం.ఎస్. అందుతుంది. (బ్యాంకు లావాదేవీల మాదిరిగా)

* పాస్ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత, అధికారం పూర్తిగా ఎమ్మార్వోదే.

* పేరు మార్పిడి(మ్యుటేషన్) జరిగిన తర్వాత ఎమ్మార్వో కార్యాలయం ముద్రవేసి, ఎమ్మార్వో సంతకం చేస్తారు. ఆ పాస్ పుస్తకాలను అదే రోజు తిరిగి సబ్ రిజిస్ట్రార్ కు పంపుతారు.

* ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్ పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా అమ్మిన వారికి, కొన్న వారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పంపుతారు.(పాస్ పోర్టుల మాదిరిగా)

* సబ్ రిజిస్ట్రార్ కార్యాయంలో డిస్పాచ్ అయిన వెంటనే ఇద్దరికీ ఎస్.ఎం.ఎస్. వెళ్తుంది.

* రైతులకు ఇచ్చే పాస్ పుస్తకంలో ఖాతా నంబరుతో పాటు పాస్ పుస్తకం యూనిక్ కోడ్, గ్రామం కోడ్, మండలం కోడ్, యజమాని ఆధార్ నంబరు ఉంటాయి.

More Telugu News