chennai: భోగి మంటల దెబ్బకు విమానాలు ఆగిపోయాయ్!

  • చెన్నైలో భోగి మంటల ఎఫెక్ట్
  • ఆకాశంలో నిండుకున్న పొగ
  • 50 మీటర్ల వరకు ఏమీ కనిపించని పరిస్థితి

పంజాబ్, హర్యానాల్లో గడ్డిని తగలబెడితే... ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి ఘటనే ఇప్పుడు చెన్నైలో చోటు చేసుకుంది. భోగి మంటల దెబ్బకు ఆకాశం దట్టమైన పొగతో నిండిపోవడంతో, ఏకంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి మంటలను కూడా వేస్తారు.

ఈ ఉదయం ప్రారంభమైన భోగి మంటల కార్యక్రమంలో ఇంట్లోని చెత్త, చెదారం, కర్రలు తదితర వస్తువులతో భారీ ఎత్తున భోగి మంటలు వేశారు. దీంతో, చెన్నై వినువీధి పొగతో నిండిపోయింది. ఎదురుగా దాదాపు 50 మీటర్ల వరకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో, విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నైకి రావాల్సిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. విమానాశ్రయంలోని పలు విమానాలు టేకాఫ్ కాకుండా ఆగిపోయాయి. కొంచెం క్లియర్ అయిన తర్వాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో, అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన వారు విమానాశ్రయంలోనే చిక్కుకుని నానా బాధలు పడ్డారు.

More Telugu News