Hyderabad: ఆగని డ్రంకెన్ డ్రైవ్‌లు.. తాగి డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయిన యువకుడు!

  • మద్యం మత్తులో కారు డ్రైవింగ్
  • అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన వాహనం
  • యువకుడి మృతి.. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు

డ్రంకెన్ డ్రైవ్‌లపై పోలీసులు చేపడుతున్న ‘డ్రైవ్’లు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. తాగుబోతులు స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌‌లోని ఫిల్మ్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం..

విశ్వజిత్ అనే యువకుడు మణికొండలో జరిగిన ‘గెట్ టు గెదర్’ పార్టీకి స్నేహితులతో కలిసి వెళ్లి వస్తుండగా ఫిల్మ్‌నగర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో విశ్వజిత్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు, బాధితులకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News