Chandrababu: మా ముఖ్యమంత్రి తెలివైనోడు కదా..!: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

  • ఏపీకి రావాల్సిన అన్నింటినీ చంద్రబాబు సాధిస్తారు
  • ఎలాంటి అభిప్రాయాలున్నప్పటికీ బీజేపీ-టీడీపీ పొత్తు తప్పదు
  • బీజేపీ ఎక్కువ సీట్లు అడగడం మంచిది కాదు
  • మా ముఖ్యమంత్రి ఒప్పుకోవడం అంతకన్నా మంచిది కాదు: జేసీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ సాధించుకుని వస్తారని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ‘ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు సమావేశమైనప్పుడు, ఆ సమావేశం ఫలిస్తుందని ఆశిస్తామే తప్ప, విఫలమవుతుందని ఆశించం. మా ముఖ్యమంత్రి తెలివైనోడు కదా! ఎట్లాగొట్లా, తన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని బయటకు వస్తారు’ అన్నారు.

బీజేపీ-టీడీపీ పొత్తు కొనసాగుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం కలిసే ఉంటామని అనుకుంటున్నా. ఏ అభిప్రాయాలున్నా కలిసిపోక తప్పదు. ఎక్కువ సీట్లు వాళ్లు (బీజేపీ) అడగడం మంచిది కాదు, మా ముఖ్యమంత్రి ఒప్పుకోవడం అంతకన్నా మంచిది కాదు’ అన్నారు.

ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశముందా? అనే ప్రశ్నకు జేసీ తనదైన శైలిలో సమాధానమిస్తూ, ‘శుభం పలకరా పెళ్లి కొడకా అంటే.. ఏదో అంటే ఎట్లయ్యా!.. శుభమే జరుగుతుందని అనుకుంటున్నా. ఈ సమస్యలన్నింటినీ మా ముఖ్యమంత్రి పరిష్కరించుకుని వస్తారు’ అన్నారు నవ్వుతూ.

More Telugu News