Agnathavasi: అజ్ఞాతవాసి ఎఫెక్ట్: ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ టెన్షన్!

  • ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్‌తోనే
  • అజ్ఞాతవాసితో పడిపోయిన మాటల మాంత్రికుడి గ్రాఫ్
  • ఎన్టీఆర్ సినిమాకు మనసు పెట్టాలని కోరుతున్న అభిమానులు
  • సోషల్ మీడియా వేదికగా పోస్టులు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు తల్లకిందులవడం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా వేధిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారి ఆవేదనకు కారణం ఏమిటంటే..

ఎన్టీఆర్ తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తోనే చేయనున్నాడు. దీంతో ఆయన అభిమానుల్లో గుబులు మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇప్పటికే ప్రారంభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్‌ను చూసిన ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌కు పలు సూచనలు చేస్తున్నారు. ‘మా హీరో సినిమానైనా మనసు పెట్టి చెయ్ మాంత్రికుడా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ సినిమాకు హిట్ ఇస్తేనే ఆయన అగ్రదర్శకుల లిస్టులో ఉంటాడని, లేదంటే కష్టమేనని చెబుతున్నారు.

పవన్ హీరోగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారీ అంచనాలకు కారణమైన త్రివిక్రమ్.. ఇప్పుడు ఆ సినిమా అంచనాలు అందుకోకపోవడానికి కారణం కూడా ఆయనేనన్న విమర్శలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని పవన్ అభిమానులు చెబుతున్నారు.

More Telugu News