Anchor Pradeep: కోర్టుకు డుమ్మా కొట్టిన యాంకర్ ప్రదీప్!

  • అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా
  • రేపు హాజరవుతానని సమాచారం ఇచ్చిన ప్రదీప్
  • రాకుంటే వారెంట్ జారీ అవుతుందని హెచ్చరించిన పోలీసులు

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి, నేడు కోర్టు ముందు హాజరుకావాల్సి వున్న యాంకర్ ప్రదీప్, కోర్టుకు డుమ్మా కొట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను కోర్టుకు రాలేకపోతున్నానని, రేపు హాజరవుతానని ఆయన సమాచారం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేపు నాంపల్లి కోర్టుకు ప్రదీప్ హాజరవుతాడని గోషామహల్ పోలీసులు వెల్లడించారు.

కాగా, డిసెంబర్ 31 తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రదీప్, వారం రోజుల తరువాత నిన్న కౌన్సెలింగ్ కు తన తండ్రితో కలసి హాజరైన సంగతి తెలిసిందే. ఆపై నేడు కోర్టుకు ఆయన హాజరు కావాల్సివుంది. ప్రదీప్ కు పడే శిక్షపై ఆసక్తితో పెద్ద ఎత్తున మీడియా నాంపల్లి కోర్టుకు చేరుకుంది. ఇక రేపు కోర్టుకు రాకుంటే, వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాల్సి వుంటుందని పోలీసు వర్గాలు ఆయన్ను హెచ్చరించినట్టు తెలుస్తోంది.

More Telugu News