ap: ఏపీ ప్ర‌భుత్వంలో మొద‌టి ట్రాన్స్‌జెండ‌ర్ ఉద్యోగిని... జాన‌కి!

  • డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌గా విధులు
  • రాష్ట్ర హౌసింగ్ బోర్డులో ఉద్యోగం
  • ప్ర‌భుత్వ పాల‌సీలో మొద‌టి ల‌బ్ధిదారు

గ‌తేడాది చివ‌ర్లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అన్ని విధాల గుర్తింపునిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లో భాగంగా జాన‌కి అనే ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ‌కు రాష్ట్ర హౌసింగ్ బోర్డు శాఖ‌లో ఉద్యోగం క‌ల్పించారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పాల‌సీలో జాన‌కి మొద‌టి ల‌బ్ధిదారు. 19 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం ధ్యేయంగా రాష్ట్ర హౌసింగ్ బోర్డు చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో ఆమె డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌గా విధుల్లో చేరింది.

మొన్న‌టి వ‌ర‌కు ఉండ‌టానికి ఇల్లు కూడా లేని జాన‌కి, ఇవాళ నెలకు రూ. 15000లు సంపాదించ‌బోతుంది. తాను ట్రాన్స్‌జెండ‌ర్ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అంద‌రూ హేళ‌న చేసేవార‌ని, త‌ల్లిదండ్రులు కూడా తనను అంగీక‌రించ‌లేద‌ని జాన‌కి వాపోయింది. కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ, బీఈడీ ప‌ట్టా ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కు ఉద్యోగం రాక‌పోవ‌డంతో అడుక్కోవాల్సిన ప‌రిస్థితిని కూడా ఎదుర్కున్నట్లు జానకి వెల్ల‌డించింది.

ఇటీవ‌ల త‌మ క‌మ్యూనిటీవారికి నిర్వహించిన ఆధార్‌, రేష‌న్ కార్డుల జారీ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ చేసిన స‌ల‌హా మేర‌కు హౌసింగ్ బోర్డులో ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిపింది. త‌న‌కు ఉద్యోగం వ‌చ్చినప్ప‌టికీ త‌ల్లిదండ్రులు త‌న స‌హ‌జ‌త్వాన్ని అంగీకరించడం లేదని జాన‌కి బాధ‌ప‌డింది.

More Telugu News