Tamilnadu: జయలలిత వారసులపై స్పష్టత ఇచ్చిన తమిళ సర్కారు!

  • ఆమెకు ప్రత్యక్ష వారసులు ఎవరూ లేరు
  • వేదనిలయం స్మారక మందిరమే
  • త్వరలోనే ప్రభుత్వ అధీనంలోకి
  • వెల్లడించిన చెన్నై కలెక్టర్ అన్బు సెల్వన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని తమిళనాడు ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. ఆమె నివాసమైన వేద నిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకోనున్నామని చెన్నై జిల్లా కలెక్టర్‌ అన్భు సెల్వన్‌ వెల్లడించారు. ఆమెకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ ఉండివుంటే, ఆమె బహిరంగంగా ఎన్నడో ప్రకటించేవారని చెప్పారు. వేదనిలయంలో రహస్యంగా గదులు ఉన్నాయా? అన్న మీడియా ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

కాగా, ఇప్పటికే అన్బు సెల్వన్ నేతృత్వంలోని 20 మంది అధికారులు వేదనిలయం స్థలం కొలతలు, ఆస్తి విలువ, తదితరాలను గణించారన్న సంగతి తెలిసిందే. అందులోని రెండు గదులను ఐటీ అధికారులు సీజ్ చేయడంతో, అందులో ఏముందోనన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇక జయకు తాము వారసులమని ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లు క్లయిమ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

మరోపక్క, తాను జయకు పుట్టిన బిడ్డనని బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు వారసులు ఎవరూ లేరని, ఒకవేళ భవిష్యత్తులో ఆధారాలతో వచ్చి క్లెయిం చేస్తే, అప్పుడు వేదనిలయంకు వెల కట్టడం జరుగుతుందని, అప్పటి పరిస్థితిని బట్టి వారికి డబ్బులు ఇవ్వడమే తప్ప, వేదనిలయాన్ని అప్పగించేది లేదని ఆయన తెలిపారు.

More Telugu News