jupally krishna rao: మూడు నెలల్లో రూ.500 కోట్ల ఉపాధి పనులే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • ఉపాధి హామీ, హరిత హారం కార్యక్రమాలపై అధికారుల‌కు దిశానిర్దేశం
  • ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయాలి
  • మొక్కలను సంరక్షించాలి
  • నర్సరీలను ఏర్పాటు చేయాలి

ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన మూడు నెలల్లో రూ.500 కోట్ల ఉపాధి పనులను పూర్తి చేయ‌డ‌మే త‌మ‌ లక్ష్యమ‌ని, కూలీలందరికి 100 రోజుల పని కల్పిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు, పాఠశాలల్లో టాయిలెట్స్ వంటి అన్నింటిని ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయాలని తెలంగాణ‌ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్  కార్యాలయంలో డీఆర్డీఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు) లతో స‌మావేశమైన జూప‌ల్లి కృష్ణారావు రాష్ట్రంలో ఉపాధి హామీ, హరిత హారం కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సంవత్సరం చివరి నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా లక్ష్యం పెట్టుకొని పనులు పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకం లక్ష్యం పూర్తి చేయాలని చెప్పారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించి, వచ్చే సంవత్సరంలో మొక్కలను నాటడానికి కావలసిన నర్సరీలను ఏర్పాటు చేయాల‌ని అన్నారు. గ్రామాలలో వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసి భూగర్భ జలాలను పెంపొందించాలని ఆదేశించారు.  

More Telugu News