Vizag: ప్రియ, పవిత్ర జాగ్రత్త... చుట్టూ కామాంధులే: పోలీసుల చేతికి సౌమ్య సూసైడ్ నోట్

  • విశాఖలో సంచలనం సృష్టించిన కుటుంబం ఆత్మహత్య
  • కామాంధుల వేధింపులు తట్టుకోలేకనేనని సూసైడ్ నోట్
  • బంధువర్గంలోని ఆడపిల్లలకు జాగ్రత్తలు
  • నోట్ ను విశ్లేషిస్తున్నామని చెప్పిన పోలీసులు

విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక సూసైడ్ నోట్ లభించింది. ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ దంపతులు, తమ ఇద్దరు బిడ్డలు విష్ణుతేజ, జాహ్నవీలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సౌమ్య నాలుగు పేజీల సూసైడ్ నోట్ ను రాసింది. ఈ నోట్ లో సంచలన ఆరోపణలు చేసిన మృతురాలు సౌమ్య, చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని, ఇక వారి వేధింపులు భరించలేక పోతున్నానని వాపోయింది. వారి ఆగడాలను తట్టుకునే శక్తి ఇక లేదని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.

చాలా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నానని, ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా తీసుకెళుతున్నానని సూసైడ్ నోట్ లో రాసింది. తన బంధువర్గంలోని ఆడపిల్లలు ప్రియ, పవిత్రలకు జాగ్రత్తలు చెప్పింది. చాలా మంది కామాంధులు ఉన్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోట్ ను విశ్లేషిస్తున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, రాజేష్ కూడా ఆత్మహత్యకు ఎందుకు ఉపక్రమించాడన్న విషయం ఇంకా తేలలేదని, వారి మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News