Gujarath: టెర్ర‌స్‌పై నుంచి తోసేసి అమ్మను క‌డ‌తేర్చిన ప్రొఫెస‌ర్‌.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు!

  • గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఘ‌ట‌న‌
  • త‌ల్లి ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో విసిగిపోయిన పుత్ర‌ర‌త్నం
  • మొద‌ట ఆత్మ‌హ‌త్య అని నమ్మబలికాడు 
  • అజ్ఞాతవ్య‌క్తి ఇచ్చిన స‌మాచారంతో నిజాన్ని రాబ‌ట్టిన పోలీసులు

నవమాసాలు మోసి, కనీ పెంచి కొడుకుని ప్రయోజకుడిని చేసింది ఆ తల్లి. వృద్ధాప్యంలో ఉన్న త‌న‌కు త‌న కొడుకే ఆస‌రాగా ఉంటాడ‌ని అనుకుంది. కానీ, త‌న కుమారుడి చేతిలోనే ఘోరంగా మృతి చెందుతాన‌ని ఆ అమ్మ ఊహించ‌లేక‌పోయింది. ఆరోగ్యం కోసం ఎండలో కూర్చోబెడ‌తాన‌ని త‌న త‌ల్లిని అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లిన ఆ కొడుకు అక్క‌డి నుంచి ఆమెను కిందకు తోసేసి హ‌త్య చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో చివ‌ర‌కు అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సందీప్ అనే ప్రొఫెసర్ నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి జై శ్రీబెన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. మూడు నెల‌ల క్రితం ఆమె అపార్ట్‌మెంట్‌పై నుంచి ప‌డి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంద‌ని భావించిన పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే, ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. దీంతో ఈ కేసులో మ‌ళ్లీ ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు.

పోలీసుల‌ విచార‌ణ‌లో మొద‌ట అస‌త్యాలు చెప్పిన‌ సందీప్ ఆ త‌రువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఆమెను ఆసుప‌త్రుల చుట్టూ తిప్ప‌లేక‌ విసిగిపోయాన‌ని, అందుకే హ‌త్య చేశాన‌ని తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుపరి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నారు. 

More Telugu News