Vijaya sai Reddy: ప్రధాని నరేంద్రమోదీని కలిసిన విజయసాయిరెడ్డి.. ‘ప్రజాసంకల్ప యాత్ర’పై చర్చ!

  • పార్లమెంట్ సమావేశాల టీ బ్రేక్ సమయంలో మోదీతో భేటీ
  • గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపుపై ప్రధానికి అభినందనలు
  • ఏపీ రాజకీయాలు, జగన్ ప్రజా సంకల్ప యాత్రపై చర్చ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంటు సమావేశాల టీ బ్రేక్ సమయంలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మోదీ చాంబర్‌కు వెళ్లిన విజయసాయిరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు. ఇద్దరూ దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, ఏపీ రాజకీయాలపై వీరు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

మోదీని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు విజయసాయి చెబుతున్నప్పటికీ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఏపీ ప్రభుత్వం కొంత అసంతృప్తిగా ఉంది. దీనికి తోడు అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో విజయసాయి రెడ్డికి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

More Telugu News