Auto: గుంటూరు జిల్లాలో దారుణాతి దారుణం... నలుగురు విద్యార్థులను చిదిమేసిన ఆర్టీసీ బస్సు!

  • విద్యార్థుల ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • నలుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ మృతి
  • మరో ముగ్గురికి గాయాలు
  • వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

చలికాలపు పొగమంచు, ఆర్టీసీ బస్సు అతివేగమూ కలిసి ఐదుగురు విద్యార్థుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. గుంటూరు జిల్లాలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనగా, ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉదయం వేమవరం నుంచి పేరేచర్లలోని స్కూలుకు ఆటోలో విద్యార్థులు బయలుదేరగా, మార్గమధ్యంలో ఫిరంగిపురం మండలం రేపూడి దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న ఆటో కనిపించ లేదని ప్రాథమికంగా తెలుస్తున్నా, బస్సు వేగం ప్రమాద తీవ్రతను పెంచిందని సమాచారం. ఈ ఘటనలో గాయత్రి, శైలజ, రేణుక, కార్తీక రెడ్డి, ధనరాజ్ లు మరణించారు. వీరిలో నలుగురు టెన్త్ చదువుతున్న విద్యార్థులు కాగా, ధనరాజ్ ఆటో డ్రైవర్. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రవాణా మంత్రి అచ్చెన్నాయుడు, గుంటూరు కలెక్టర్ తో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు.

More Telugu News