Malakondaiah: ఏపీఎస్ ఆర్టీసీ టూ ఏపీ డీజీపీ... ఠాకూర్, గౌతమ్ సవాంగ్ లను వెనక్కు నెట్టిన మాలకొండయ్య!

  • నేడో, రేపో ఉత్తర్వులు
  • 1985 బ్యాచ్ కి చెందిన మాలకొండయ్య
  • ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ
  • ఆరు నెలలు పదవిలో ఉండనున్న మాలకొండయ్య

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా మాలకొండయ్య నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు పదవీకాలం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో, తదుపరి డీజీపీగా మాలకొండయ్యను నియమించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

1985 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మాలకొండయ్య, ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. ఆయన భార్య పూనం ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డీజీపీ రేసులో మాలకొండయ్యతో పాటు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ కూడా పోటీ పడినప్పటికీ, సీనియారిటీ ఉన్న కారణంగా మాలకొండయ్య వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆరు నెలల పాటు డీజీపీగా మాలకొండయ్య కొనసాగనున్నారు. కేంద్రం జోక్యం లేకుండానే ఏపీ సర్కారు డీజీపీని ఎంపిక చేయడం గమనార్హం.

More Telugu News