Satavahana: నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. ‘శాతవాహన’ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు

  • మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన విద్యార్థులు
  • దాడి చేసిన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు
  • ఖండించిన ప్రజా సంఘాలు
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ ఘటనకు నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థలు మూసివేసి బంద్‌కు సహకరించాలని కోరాయి. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగినట్టు తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక (టీమాస్ ఫోరం) ఆరోపించింది. విద్యార్థుల దాడిని నిరసిస్తూ బుధవారం ‘చలో శాతవాహన యూనివర్సిటీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఐక్య వేదిక ప్రకటించింది.

ప్రొఫెసర్ కంచ ఐలయ్య అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. విద్యార్థులపై దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్ట్ చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని వక్తలు హెచ్చరించారు. బీజేపీ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, తక్షణమే విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

More Telugu News