Rohini S*x Rocket: రోహిణి సెక్స్ రాకెట్ కేసు... మరింత మంది అమ్మాయిలకు విముక్తి!

  • అమ్మాయిలను బంధించి ఇరుకు గదుల్లో పెట్టిన వీరేంద్ర దేవ్ దీక్షిత్
  • ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం పేరిట అన్ రిజిస్టర్డ్ సొసైటీ
  • బాగోతాన్ని బయటపెట్టిన సోదాలు

తనకు తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుని ముక్కు పచ్చలారని అమ్మాయిలను నిర్బంధించి, వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించిన వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై నేడు కూడా దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా, 'ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం' పేరిట ఆయన నడుపుతున్న రోహిణి సొసైటీపై దాడి చేసిన పోలీసులు, మరింత మంది మైనర్ బాలికలను రక్షించి తీసుకొచ్చారు.

ఇక్కడ ఓ పెద్ద సెక్స్ రాకెట్ ను వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్నాడని, బయటి నుంచి వచ్చేవారి వద్దకు అమ్మాయిలను పంపేవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు గీతా మిట్టల్, హరి శంకర్ ఆదేశాల మేరకు రోహిణి ప్రాంతంలోని వీరేంద్ర ఆశ్రమాలపై శుక్రవారం నుంచి పోలీసులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్మీత్ రామ్ రహీమ్ రాయించుకున్నట్టుగానే, వీరేంద్ర సైతం తన భక్తుల నుంచి పలు రకాల అఫిడవిట్లు రాయించుకున్నాడని, వందల కోట్ల విలువైన ఆస్తులను తన పేరిట బదలాయించుకున్నాడని, వాటికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని సోదాలు జరుపుతున్న అధికారులు తెలిపారు.

ఆశ్రమం లోపల మెటల్ డోర్లు, గదులు, వాడేసిన సిరంజిలు లభించాయని, వందల మంది మహిళలను ఇరుకు గదుల్లో కుక్కి, వారితో వీరేంద్ర వ్యభిచారం చేయిస్తుండేవాడని తెలిపారు. గత 25 ఏళ్లుగా విజయ్ విహార్ ఆశ్రమం నడుస్తుండగా, ఇక్కడ అశ్లీల కార్యకలాపాలు, డ్రగ్స్ వాడకం, మహిళల విక్రయం వంటివి జరుగుతున్నాయని చానాళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదుతో డొంక కదిలింది.

More Telugu News