KTR: 'పూర్తి స‌హ‌కారం అందిస్తాం'.. సియామ్ కార్య‌నిర్వాహ‌క సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం

  • ఆటోమోబైల్ రంగ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల ప్రదేశం
  • పరిశోధన, ఇన్నోవేషన్లో ముందంజ కోసం మోబిలీటీ రీసెర్చీ క్లస్టర్ ఏర్పాటు
  • కంపెనీలకు అవసరమయ్యే కార్మికుల‌కు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ 

తెలంగాణ రాష్ట్రం ఆటోమోబైల్ రంగ పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రదేశమ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న సొసైటీ అఫ్ అటోమోబైల్ మ్యానుఫాక్చరర్స్ అసోషియేషన్ (సియామ్) కార్యనిర్వాహక సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఆటో కంపోనెంట్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోషియేషన్ (అక్మా) ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటోమోబైల్ రంగ పెట్టుబడులకున్న అవకాశాలను కేటీఆర్‌ వివరించారు. అలాగే మూడు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, అకర్షించిన భారీ పెట్టుబడులు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి చెప్పారు.

పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న తీరుని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరం అయిన భూమి, నీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి కొరత లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాన్యూఫాక్చరింగ్ (తయారీ రంగానికి)కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వమే ఆటోమోబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో టాస్క్ (TASK) ద్వారా శిక్షణ ఇచ్చి అవసరం అయిన మానవ వనరులను సమకూరుస్తామని మంత్రి కేటీఆర్‌ కంపెనీలకు హమీ ఇచ్చారు.

తెలంగాణ‌లో ఆటోమోబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయని, ఇప్పటికే ఏంఅర్ యఫ్, మహీంద్రా వంటి కంపెనీలు, జడ్ యఫ్ ( ZF) వంటి అంతర్జాతీయ సంస్థ‌లు తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆటోమోబైల్ రంగ పెట్టుబడులకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో ఉండేందుకు మోబిలిటీ రీసెర్చీ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆటోమోబైల్ రంగ అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు అవసరం అయిన విధాన రూపకల్పనలో సియామ్, అక్మా సంస్ధలతో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

More Telugu News