KL Rahul: ధోనీ గురించి మాట్లాడిన విలేకరిపై మండిపడ్డ కేఎల్ రాహుల్!

  • ధోనీ ఫామ్ పై ప్రశ్నించిన విలేకరి
  • ధోనీ ఆటను ప్రశ్నించడం ఏంటి?
  • ఆయన సరాసరి చూడటం లేదా?
  • మాకందరికీ ఆయన ఆదర్శం: కేఎల్ రాహుల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ గురించి ప్రశ్నించిన విలేకరిపై కేఎల్ రాహుల్ మండిపడ్డాడు. "మీరు ఏ ఫామ్ గురించి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. మీరు మాత్రమే ధోనీ ఆటను ప్రశ్నిస్తున్నారు. నేను ఎప్పుడు టీవీలో క్రికెట్ చూస్తున్నా, మైదానంలో ధోనీని చూస్తున్నా ఆయన పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఇక ఫామ్ లేదని చెప్పడమేంటి?" అని ప్రశ్నించాడు.

 బారాబతి స్టేడియంలో ధోనీ (39)తో కలిసి పరుగుల వరద సృష్టించిన రాహుల్ (61), శ్రీలంకతో తొలి టీ-20ని 1-0తో ఇండియా గెలుచుకునేందుకు తనవంతు సహకారాన్ని అందించిన సంగతి తెలిసిందే. డ్రస్సింగ్ రూములో తమకందరికీ ధోనీయే ఆదర్శమని, భారత జట్టులో మ్యాచ్ విన్నర్లు అని ఎవరైనా ఉన్నారంటే, వారిలో ధోనీ ముందు వరుసలో ఉంటాడని చెప్పాడు. ప్రతి గేములో ప్రతి ఒక్కరూ రాణించలేరని, కానీ, ధోనీ విషయంలో సరాసరి గణాంకాలు చూసి మాట్లాడాలని హితవు పలికాడు. ప్రతి ఇన్నింగ్స్ తమకు ముఖ్యమైనదేనని, అవకాశాలు లభిస్తే, పరుగులు చేసేందుకు ఎవరూ వెనుకాడబోరని ఈ కర్ణాటక బ్యాట్స్ మెన్ అన్నాడు.

More Telugu News