rahul gandhi: మోదీ విశ్వసనీయత కోల్పోయారు.. వణుకు పుట్టించాం: రాహుల్ గాంధీ

  • మోదీ మాటను ఎవరూ వినడం లేదు
  • జీఎస్టీ, డీమానిటైజేషన్ ఊసు కూడా ఎత్తలేక పోయారు
  • ఇకపై మోదీకి గడ్డు కాలమే

గుజరాత్ లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 'మీ కోపం ఎందుకూ పనికి రాదు... మిమ్మల్ని ఓడించడానికి ప్రేమ చాలు' అనే సందేశాన్ని ఈ ఫలితాలు మోదీ, బీజేపీకి పంపాయని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో మోదీ మోడల్ అనేది కేవలం ప్రచార స్టంట్ గానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రచారంలో జీఎస్టీ, డీమానిటైజేషన్ తదితర అంశాల ఊసు కూడా మోదీ ఎత్తలేక పోయారని అన్నారు. భవిష్యత్తులో మోదీకి ఎన్నో సమస్యలు రానున్నాయని చెప్పారు. అతని మాటలను ఎవరూ వినడం లేదని చెప్పారు. గుజరాత్ లో కాంగ్రెస్ గెలవనప్పటికీ.... ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగానే వచ్చాయని తెలిపారు.

నాలుగు నెలల క్రితం తాము గుజరాత్ కు వెళ్లే ముందు కాంగ్రెస్ ను అవహేళన చేశారని... పది స్థానాల్లో కూడా గెలవదని అన్నారని రాహుల్ తెలిపారు. కానీ, తమ కఠోర శ్రమ గుజరాత్ లో కాంగ్రెస్ ను గర్వంగా నిలబెట్టిందని చెప్పారు. బీజేపీ వెన్నులో వణుకు పుట్టించామని తెలిపారు. ప్రజల విశ్వసనీయతను మోదీ కోల్పోయారని చెప్పారు. గుజరాత్ ప్రజలు తమపై ఎంతో ప్రేమను చూపారని... అవసరమైనప్పుడు రాష్ట్రానికి తన సేవలను అందిస్తానని అన్నారు.

More Telugu News