hijra: చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన హిజ్రాలు!

  • హిజ్రాలకు పెన్షన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • తిరుపతిలో సంబరాలు జరుపుకున్న హిజ్రాలు
  • ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హిజ్రాలు అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. హిజ్రాలకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లను ప్రకటించిన నేపథ్యంలో తిరుపతిలో వారు ఈ సంబరాలు జరుపుకున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా తమను గుర్తించలేదని, తమ సమస్యలను పట్టించుకోలేదని, చంద్రబాబు మాత్రం తమకు రేషన్ కార్డులు, రూ. 1500 పెన్షన్ ను, ఇంటి స్థలాలను ఇచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా రంగులు చల్లుతూ, డ్యాన్సులు చేస్తూ వేడుక జరుపుకున్నారు.

మరోవైపు, ఢిల్లీ నగర వీధుల్లో సైతం హిజ్రాలు చంద్రబాబును కొనియాడారు. హిజ్రాలకు ఇళ్లను నిర్మించారని, పెన్షన్లను ఇచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టమెంట్ స్ట్రీట్ లో ధర్నా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ట్రాన్స్ జెండర్ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. హిజ్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండానే బిల్లును రూపొందించారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల నుంచి వందలాది మంది హిజ్రాలు తరలివచ్చారు. 

More Telugu News