vizag: విశాఖ విమానాశ్రయానికి మరో గుర్తింపు... విదేశీయులు నేరుగా వచ్చి వీసా తీసుకోవచ్చు!

  • వీసా ఆన్ అరైవల్ సదుపాయం
  • కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు
  • 147 దేశాల పర్యాటకులకు వెసులుబాటు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం విమానాశ్రయానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విదేశీయులు ముందుగా వీసా తీసుకోకపోయినా నేరుగా విశాఖపట్నం వచ్చేసి విమానాశ్రయంలోనే వీసా తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. దీన్నే వీసా ఆన్ అరైవల్ గా పేర్కొంటారు. కాకపోతే విదేశీయులు బయల్దేరే ముందు ఆన్ లైన్ లో ఇందుకోసం దరఖాస్తు చేసుకుని రావాల్సి ఉంటుంది.

విశాఖ విమానాశ్రయానికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తూ కేంద్ర హోం శాఖ అనుమతి జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో 147 దేశాల పర్యాటకులు నేరుగా విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ అయి వీసా తీసుకుని రాష్ట్రంలోని అందాలను సందర్శించి వెళ్లే అవకాశం కలిగింది. ఈ సదుపాయం అన్నది విదేశీ పర్యాటకులకు ఎంతో వెసులుబాటు కానుంది.

More Telugu News