Monkey: కోలారులో దారుణం.. వానరాల సామూహిక హత్య!

  • పెద్ద ఎత్తున కోతులను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • మృతదేహాలను కొండపై పడేసిన వైనం
  • స్థానికులు చూడడంతో వెలుగులోకి

కర్ణాటకలోని కోలారులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 30కిపైగా కోతులను చంపేసి వాటిని సంచుల్లో నింపి ఓ చోట పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు  చూసింది. కట్టి శ్రీనివాసపురం తాలూకాలోని యర్రకొండ గ్రామస్థుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు 30కిపైగా కోతులను చంపేశారు. అనంతరం వాటి మృతదేహాలను ఓ సంచిలో వేసుకొచ్చి యర్రకొండ పర్వతప్రాంతంలోని ఓ చోట పడేశారు.

కొండపైకి వెళ్లిన స్థానికులు వీటిని చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారొచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోతులను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న దానిపై వివరాలు రాబడుతున్నారు. కాగా, వానరాలను చంపి పడేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News