Rohit Sharma: పెద్ద మనసు చాటుకున్న రోహిత్.. శ్రీలంక అభిమానికి ఆర్ధిక సాయం!

  • మ్యాచ్ లు చూసేందుకు శ్రీలంక నుంచి వచ్చిన నిలామ్
  • తండ్రికి సీరియస్ అంటూ ఫోన్
  • సరిపడా డబ్బు లేకపోతే.. సాయం చేసిన రోహిత్

ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే రోహిత్ శర్మకు దయా గుణం కూడా ఎక్కువే. తాజాగా తన పెద్ద మనసును రోహిత్ చాటుకున్నాడు. భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్ లను చూసేందుకు మొహ్మద్ నిలామ్ అనే అభిమాని శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చాడు. అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతని తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఢిల్లీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బయల్దేరి వచ్చేయాలంటూ కుటుంబసభ్యులు చెప్పారు. అయితే, అప్పటికప్పుడు బయల్దేరేంత డబ్బు అతని వద్ద లేదు.

ఈ నేపథ్యంలో, సచిన్ టెండూల్కర్ వీరాభిమాని అయిన సుధీర్ గౌతం ఈ విషయాన్ని రోహిత్ శర్మకు చెప్పాడు. వెంటనే అతన్ని పిలిపించుకున్న రోహిత్... అతడికి రూ. 20 వేల నగదును అందజేశాడు. ఈ విషయాన్ని నిలామ్ స్వయంగా ఓ ఛానల్ కు వెల్లడించాడు. భారత జట్టు బస చేస్తున్న హోటల్ కు రోహిత్ తనను పిలిచి, సరిపడా డబ్బు ఇచ్చాడని తెలిపాడు. నాన్నకు సర్జరీ బాగా జరిగిందని చెప్పాడు. రోహిత్ మనసు చాలా గొప్పదని కొనియాడాడు.

More Telugu News