Pawan Kalyan: పవన్ కల్యాణ్ ‘గుండు’ వివాదం.. ఆనాడు పరిటాల చెప్పింది ఇదీ!

  • పవన్ గుండుపై ఆనాడే క్లారిటీ ఇచ్చిన పరిటాల రవి
  • చిరంజీవి కుటుంబంతో తనకు విభేదాలు లేవని స్పష్టీకరణ
  • పవన్ ‘గుండు’ గిట్టని వారి ప్రచారమన్న టీడీపీ నేత

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ‘గుండు’ పెద్ద చర్చనీయాంశమైంది. ఏపీలో పర్యటిస్తున్న పవన్ ఓ సభలో మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఈ గుండు ప్రస్తావన తీసుకొచ్చారు. తనకు అప్పట్లో పరిటాల రవి గుండు కొట్టించారన్న ప్రచారం జరిగిందని, అందులో ఎటువంటి వాస్తవం లేదని కరాఖండీగా తేల్చి చెప్పారు. ఎప్పుడో జరిగిన ఈ ఘటన గురించి పవన్ మళ్లీ ఇప్పుడు ప్రస్తావించడంతో ‘గుండు’ మరోమారు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు.. పరిటాల రవి జీవించి ఉన్నప్పుడు కూడా ఇది సెన్సేషన్ అయింది. దీంతో ఈ విషయాన్ని మీడియా అప్పట్లో ఓసారి పరిటాల వద్ద ప్రస్తావించగా ఆయన అసలు విషయాన్ని బయటపెట్టారు. మీడియాతో పరిటాల చెప్పింది ఇదీ..

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటి పక్కన స్థలం కొనుగోలు చేయాలని చిరంజీవి అనుకున్నారని, దీంతో వద్దని ఆయనను వారించానని పరిటాల పేర్కొన్నారు. తనకు భద్రతాపరమైన సమస్యలు ఉండడంతో వచ్చీపోయే వాహనాలను తన వాళ్లు ఆరా తీస్తుంటారని, అది చిరంజీవికి, ఆయన కోసం వచ్చే వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేయవద్దని సలహా ఇచ్చానని వివరించారు. చిరంజీవి కూడా అర్థం చేసుకుని ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేదని చెప్పారు.

 అంతే తప్ప చిరంజీవి కుటుంబంలో ఎవరితోనూ తనకు సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. చివరిగా పవన్ కల్యాణ్ గుండు గురించి మాట్లాడుతూ.. పవన్‌తో తనకు పరిచయం లేదని, బహుశా తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి ఉంటారని తేల్చిచెప్పారు. అది తెలియక, తానంటే గిట్టనివారు తానే అతడికి గుండు కొట్టించానని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా, 2005లో పరిటాల హత్యకు గురయ్యారు.

More Telugu News