Pawan Kalyan: నా ఆధార్ కార్డు మీకు ఎందుకివ్వాలి?: కేంద్రానికి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

  • ప్రత్యేక హోదాను మీరు ఇవ్వనప్పుడు... నేను ఆధార్ ఎందుకివ్వాలి?
  • ప్రజల విశ్వాసాన్ని కోల్పోవద్దు
  • విప్లవాలు పుట్టుకొస్తాయి

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. పార్లమెంటు సాక్షిగా మీరు చెప్పిన మాటలకు మీరే విలువ ఇవ్వనప్పుడు... మీకు మేమెందుకు విలువ ఇవ్వాలని పవన్ విరుచుకుపడ్డారు. తన ఆధార్ కార్డును తమకు ఎందుకు ఇవ్వాలని ఆయన సూటిగా ప్రశ్నించారు.

మాకు ఇస్తామన్న ప్రత్యేక హోదాను మీరు ఇవ్వనప్పుడు... మేమెందుకు ఆధార్ ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే నైతిక విలువలను కలిగి ఉండాలని... ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోరాదని అన్నారు. ఇచ్చిన మాటలు తప్పుతూ, పరిపాలన కొనసాగిస్తే... ప్రజల్లో విప్లవాలు వస్తాయని హెచ్చరించారు.

ప్రజలను రెచ్చగొట్టాలని తాను భావించి ఉంటే కాకినాడ సభ నుంచే రెచ్చగొట్టేవాడినని... కానీ, తాను అలా చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చిందని... స్పెషల్ స్టేటస్ కోసం తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

More Telugu News