Stone-pelting: నిన్న సైన్యంపై రాళ్లు రువ్విన యువతి నేడు ఫుట్ బాల్ కెప్టెన్... కాశ్మీర్ అమ్మాయి ఫోటోలు!

  • రాష్ట్రంలో ఫుట్ బాల్ కు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం
  • తోటి అమ్మాయిపై పోలీసు చెయ్యి చేసుకోవడంతో రాళ్లు విసిరిన అఫ్సాన్
  • విషయం కేంద్రం దృష్టికి - సమస్య పరిష్కారం

రాళ్లు రువ్వుతున్న అఫ్సానా... ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా

అఫ్సాన్ ఆషిక్... తన రాష్ట్రంలోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఆరోపిస్తూ, నిన్నటి వరకు భారత సైన్యంపై రాళ్లు రువ్విన యువతి. ముఖానికి ముసుగు ధరించి, వీపుపై పుస్తకాల బ్యాగుతో కోపంతో చూస్తూ ఆమె రాళ్లు విసురుతున్న దృశ్యాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి కూడా. ఆ అమ్మాయి ఎవరన్న విషయమై పెద్ద చర్చ జరుగగా, ఆమె మంచి ఫుట్ బాల్ క్రీడాకారిణని, రాష్ట్రంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై ఉన్న ఆగ్రహమే ఆమెను అలా మార్చిందని కథనాలు వచ్చాయి.

ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా ఆమెను కలవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మహిళల ఫుట్ బాల్ ను ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా అఫ్సానే, జమ్మూ కాశ్మీర్ మహిళా ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్. ఇండియన్ ఉమెన్ లీగ్ లో తన జట్టును ముందడుగు వేయించడమే ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం. ఇప్పటివరకూ పురుషులు మాత్రమే ఆధిపత్యం చూపిన ఫుట్ బాల్ క్రీడపై తనకు మక్కువ పెరగడానికి బాలీవుడ్ లో విడుదలైన ఓ సినిమానే కారణమని చెప్పే అఫ్సానా, గతంలో ముంబై క్లబ్ తరఫున కూడా ఆడింది.

తమ సమస్యలను కేంద్రం ఎంతో ఓపికతో విని మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చిందని, కేంద్ర హోం మంత్రి మా ముందే ముఫ్తీని పిలిచి, శ్రీనగర్ వెళ్లగానే, కోచింగ్ నుంచి అత్యాధునిక పరికరాల వరకూ ఏర్పాటు చేయాలని సూచించారని అఫ్సానా చెబుతోంది. రాళ్ల దాడికి దిగిన తనకు, ఇప్పుడాపని చేసినందుకు సిగ్గుగా ఉందని, తాను అలా చేయకుండా ఉండాల్సిందని, అయితే, తన టీమ్ లోని ఓ అమ్మాయిని పోలీసు కొట్టడంతోనే ఆ పని చేశానని చెప్పింది. ఫుట్ బాల్ క్రీడలో తన రాష్ట్రానికి గర్వకారణంగా నిలవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చింది.

More Telugu News