cuple: భార్య టార్చర్ పడలేక కోర్టుకెక్కిన భర్త.. పెళ్లైన నెల రోజులకే విడాకులు మంజూరు!

  • లావుగా ఉందని వివాహానికి నిరాకరించిన భర్త
  • నచ్చజెప్పి వివాహం జరిపించిన తల్లిదండ్రులు
  • అత్తపై దాడి..చేయి ఫ్రాక్చర్

ఆహారం పరంగా భార్య పెడుతున్న టార్చర్ తట్టుకోలేక విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన వ్యక్తికి, వివాహమైన నెల రోజులకే ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ కథాకమామీషులోకి వెళ్తే... బెంగళూరులో ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. అయితే యువతి కాస్త లావుగా ఉందని వివాహానికి అతను నిరాకరించగా, తల్లి ఒప్పించి నెల రోజుల క్రితం వివాహం జరిపించింది.

దీంతో ఆమె ఎలాగైనా ఒళ్లు తగ్గించుకుని, సైజ్ జీరోకి రావాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో నాజూగ్గా మారాలనే తాపత్రయంతో చాలాకాలంగా డైట్‌ చేస్తోంది. దీంతో కేవలం ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. తాను తినడమే కాకుండా, తన భర్త, అత్తలకు కూడా అవే పెట్టేది. అవి తమకు పడవని, తమకోసం వేరే ఆహారం తయారు చేయమని భర్త చెబితే ఎదురు చెప్పేది. తాను పెట్టిన వాటినే తినాలని ఒత్తిడి చేసేది.

పొరపాటున ఆమె పెట్టిన ఆకులు అలములను తినకపోతే ఆ ఇద్దరినీ ఇష్టమొచ్చినట్టు కొట్టేదని ఆ భర్త వాపోయాడు. ఒకసారి ఆమె కొట్టిన దెబ్బలకు తన తల్లి చెయ్యి విరిగిపోయిందని అతను తెలిపాడు. అప్పటినుంచి ప్రతి చిన్న విషయానికీ గొడవపడేదని ఆయన చెప్పాడు. వేరు కాపురం పెట్టాలని పోరుతుండడంతో తట్టుకోలేక..ఆమె వేధింపులు తాళలేనని పేర్కొంటూ విడాకుల కోసం బెంగళూరు కుటుంబ కోర్టును ఆశ్రయించాడు.

ఆ కేసు విచారణ ప్రారంభించిన న్యాయస్థానం అతని భార్య అభిప్రాయం కోరింది. దానికి ఆమె ఆ వివాహం తనకు కూడా ఇష్టం లేదని, తల్లిదండ్రుల బలవంతంతో వివాహానికి అంగీకరించానని చెప్పడంతో న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ఆరు నెలల కౌన్సిలింగ్, పరిశీలన వంటివి ఉంటాయి. ఇక వారిద్దరూ కలిసేది లేదని తేలిన తరువాత వారికి విడాకులు మంజూరు చేస్తారు. అయితే చిత్రంగా ఈ కేసులో నెల రోజుల కాపురం తరువాత వారికి విడాకులు మంజూరు చేయడం విశేషం.

More Telugu News