Bali: లావాను వెదజిమ్మడం ఆపేసిన బాలి అగ్నిపర్వతం.. నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం!

  • బూడిద తగ్గుముఖం పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న పర్యాటకులు
  • ప్రమాదం పొంచే ఉందన్న విపత్తు నిర్వహణ అధికారులు
  • నేటి నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ

ఇటీవల బద్దలైన బాలిలోని మౌంట్ ఆగునంగ్ అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న బూడిద తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతవారం ఆగునంగ్ అగ్ని పర్వతం బద్దలు కాగా పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. వేలాదిమంది పర్యాటకులు శిబిరాల్లో సేద తీరుతున్నారు. బూడిద విపరీతంగా ఆకాశంలోకి వస్తుండడంతో పలు విమానయాన సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి.

ప్రస్తుతం బూడిద తగ్గుముఖం పట్టడంతో విమానాలను తిరిగి నడిపేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అగ్నిపర్వతం కారణంగా ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం పేర్కొంది. అయితే పర్యాటకులందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ‘ఎక్స్‌క్లూజన్ జోన్‌’ పరిధిని పది కిలోమీటర్లకు పెంచినట్టు పేర్కొంది. ప్రస్తుతం 55 వేల మంది శిబిరాల్లో ఉన్నట్టు వివరించింది.

ఆకాశంలోకి బూడిద పెద్ద ఎత్తున ఎగిరిపడుతుండడంతో జెట్‌స్టార్, వర్జిన్ ఆస్ట్రేలియా వంటి విమానయాన సంస్థలు వారం పాటు తమ సర్వీసులను నిలిపివేశాయి. బూడిద ప్రభావం తగ్గిన తర్వాత కానీ సర్వీసులను పునరుద్ధరించలేమని పేర్కొన్నాయి. ప్రస్తుతం బూడిద తగ్గడంతో నేటి (సోమవారం) నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News