rk nagar: ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో విశాల్ పోటీ.. తెలుగు వారి ఓట్లు చీల్చడానికా?

  • డిసెంబర్ 21న ఆర్కేనగర్ ఉపఎన్నిక
  • అన్నాడీఎంకే తరపున మదుసూదన్
  • శశికళ వర్గం నుంచి దినకరన్
  •  స్వతంత్రుడిగా విశాల్

ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ కంటే ముందే విశాల్ రాజకీయ రంగ ప్రవేశం జరిగిపోనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు ఈనెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేయనున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వెలువడగా, విశాల్ పీఆర్వో వాటిని ధ్రువీకరించారు.

సోమవారం ఆయన ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఆర్కేనగర్ లో తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారని, మెజారిటీ తెలుగు వారే కావడంతో అక్కడ తెలుగు మూలాలు కలిగిన వారిని విజయం వరిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థిగా తెలుగు వ్యక్తి మదుసూదన్ నిలబడనున్నారు.

శశికళ వర్గం నుంచి దినకరన్ తానే నేరుగా బరిలో దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్ బరిలో దిగుతున్నాడని వార్తలు వెలవడడంతో...ఆర్కేనగర్ ఉపఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. విశాల్ స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. జయలలిత అసలు సిసలు వారసుడు విశాల్ అని, జయలలిత సినీ రంగం నుంచి వచ్చారని, ఆమెకు అధికారిక వారసులు లేనందువల్ల విశాలే అసలు వారసుడంటూ ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

కాగా, విశాల్ ను దినకరన్ బరిలో దించుతున్నాడని, ఆర్కేనగర్ లో తెలుగు ఓటర్లు మెజారీ కావడంతో మదుసూదన్ ను విజయం వరించే అవకాశం ఉందని, దీంతో తెలుగు ఓట్లు చీల్చితే విజయం తనదేనని దినకరన్ భావిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే విశాల్ బరిలో దిగాడని వార్తలు వినబడుతున్నాయి. దీనికి సాక్ష్యంగా గతంలో దినకరన్ తో విశాల్ రెండు సార్లు భేటీ అయ్యాడని అతని ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. 

More Telugu News