somu veerraju: జేసీ దివాకర్ రెడ్డి బ్రోకర్, కోవర్టు: సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు

  • జేసీ దివాకర్ రెడ్డికి బీజేపీని విమర్శించే అర్హత లేదు
  • సొంత పనుల కోసం సీఎంను బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు జేసీ
  • 1400 కోట్ల కోసం ప్రాజెక్టు వదిలేస్తారా?

పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ను, మిత్రపక్షమైన తమను బీజేపీ వంచించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఊరికే అంచనాలు పెంచుతున్నారంటూ బీజేపీ నేతలు టీవీ చర్చల్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని, టీడీపీలో ఉన్న కాంగ్రెస్ కోవర్టు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 తన సొంత పనుల కోసం జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి జేసీకి తమ పార్టీని విమర్శించే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 1400 కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియలో సాంకేతిక లోపాలు వస్తే, ప్రాజెక్టును వదిలేస్తానని చంద్రబాబు ప్రకటించడం సరికాదని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేయడం సరికాదని ఆయన చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

More Telugu News