delhi: షాకింగ్... దేశ రాజధానిలో మహిళా న్యాయమూర్తినే కిడ్నాప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్

  • కర్ కర్ దుమా కోర్టుకి వెళ్లేందుకు క్యాబ్ బుకింగ్
  • కోర్టుకు కాకుండా హపూర్ వైపు క్యాబ్ మళ్లించిన డ్రైవర్
  • సహచరులు, పోలీసులకు సమాచారమిచ్చి అప్రమత్తత

క్యాబ్ డ్రైవర్ ఏకంగా మహిళా న్యాయమూర్తిని అపహరించబోయిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కర్ కర్ దుమా కోర్టుకు వెళ్లేందుకు మహిళా న్యాయమూర్తి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. అనంతరం కోర్టుకు హాజరయ్యేందుకు ఎక్కారు. కర్‌ కర్‌ దూమా కోర్టుకు వెళ్లాల్సిన క్యాబ్ ను డ్రైవర్ జాతీయ రహదారి-24 పై ఉన్న హపూర్‌ వైపు మళ్లించి వేగం పెంచాడు.

దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై తన సహచరులు, పోలీసులకు సమాచారం అందించారు. కొంత దూరం వెళ్లిన తరువాత క్యాబ్ డ్రైవర్ యూటర్న్ తీసుకుని ఢిల్లీ దిశగా క్యాబ్ ను పోనిచ్చాడు. దీంతో కారును వెంబడించిన పోలీసులు ఘాజిపుర్‌ టోల్‌ ప్లాజా వద్ద కారును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అత్యాచారాలు, కిడ్నాపులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏకంగా మహిళా న్యాయమూర్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరగడం ఢిల్లీలో మహిళా రక్షణపై తీవ్ర ఆందోళన రేపుతోంది. 

More Telugu News