delhi: గ్లాసుడు జ్యూస్ కోసం ఓ చిరు వ్యాపారిని కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు!

  • దేశ రాజధానిలో దారుణం
  • జ్యూస్ ఉచితంగా ఇవ్వలేదని గొడవ
  • పిడిగుద్దులతో రెచ్చిపోయిన నిందితులు
  • గుండె బద్దలై మరణించిన చిరు వ్యాపారి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గ్లాసుడు జ్యూస్ ఉచితంగా ఇవ్వలేదన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ చిరువ్యాపారిని దారుణంగా కొట్టి హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సంతోష్ అనే చిరు వ్యాపారి ఆదర్శ్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన జ్యూస్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని వద్దకు తన స్నేహితుడితో కలిసి వచ్చిన సతీష్ అనే వ్యక్తి, జ్యూస్ ను ఉచితంగా ఇవ్వాలని తొలుత గొడవ పడ్డారు.

అప్పటికి స్థానికులు కల్పించుకోవడంతో వెనక్కు తగ్గిన ఇద్దరూ, తిరిగి సాయంత్రం తమ స్నేహితుడైన మరో వ్యక్తిని తీసుకుని వచ్చి గొడవ పడి సంతోష్ పై పిడిగుద్దులతో రెచ్చిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సంతోష్ మిత్రులు మహేష్, సుమిత్ లు, అతన్ని బాబా హిందూరావు ఆసుపత్రికి తరలించగా, పిడిగుద్దుల కారణంగా గుండె చితికి సంతోష్ మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు సతీష్, సందీప్, సాగర్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News