YSRCP: స్వామీజీతో జగన్.. నెట్ లో ఫొటో.. కామెంట్లు వైరల్!

  • పాదయాత్రలో జగన్ ను కలిసిన స్వామీజీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • రకరకాల కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

2019లో అధికారమే లక్ష్యంగా 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణ నిమిత్తం నిన్న ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ రోజు యథావిధిగా కర్నూలు జిల్లాలో యాత్ర మళ్లీ ప్రారంభమైంది.

ఈ పాదయాత్ర సందర్భంగా జగన్ ను ఓ స్వామీజీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ చేతిని ఆప్యాయంగా పట్టుకుని జగన్ అతనితో ముచ్చటించాడు. ఈ ఫొటోను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఏందయ్యా జగన్ బాబు, ఏంటి నీకు ఇన్ని కష్టాలు. ఎలా ఉండాల్సినవాడివి. ఎలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్టు ఉంది. దోచుకుని తింటున్నది ఒకరైతే... ప్రజల కష్టాలు మాత్రం నీవా? మంచి రోజులు వస్తాయి జగన్ బాబూ. సాక్షాత్తు ఓ స్వామీజీ జగన్ అన్నతో అన్న మాటలు ఇవి" అంటూ ఫొటోకు డిస్క్రిప్షన్ కూడా పెట్టారు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. నిజం గెలుస్తుందిలే స్వామీ... జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ కొందరు స్పందించారు.

"నిజమే స్వామీ, ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జడ్జి దర్శనం చేసుకుని రావాలంటే కష్టంగానే ఉంది. ఏం చేస్తాం. బిడ్డ అల్లాడిపోతున్నాడు" అంటూ మరి కొందరు సెటైర్ వేస్తున్నారు.

More Telugu News