panjab: విడాకుల కోసం దగ్గరుండి మరీ స్నేహితులతో భార్యను గ్యాంగ్ రేప్ చేయించిన భర్త!

  • మూడేళ్ల క్రితం నిందితుడ్ని వివాహం చేసుకున్న బాధితురాలు
  • 8 సార్లు అబార్షన్ చేయించి, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించిన ప్రబుద్ధుడు
  • విడాకులివ్వాలని ఒత్తిడి...  నిరాకరించిన బాధితురాలు
  • ముగ్గురు స్నేహితులతో సామూహిక అత్యాచారం 

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. భార్య నుంచి బలవంతంగా విడాకులు పొందేందుకు ఓ భర్త తన స్నేహితులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని లూధియానాలో బాధితురాలు మూడేళ్లక్రితం కూలి పని చేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ అది రెండో వివాహమే. పిల్లలు కనడం ఇష్టం లేని ఆ వ్యక్తి బాధితురాలికి 8 సార్లు అబార్షన్ చేయించాడు.

ఆ తర్వాత ఏకంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించాడు. అనంతరం విడాకులివ్వాలని ఆమెను వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు భర్త... గత జూన్ 6న తన ముగ్గురు స్నేహితులను ఆమె గదిలోకి పంపి తాళం వేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఇది మరోసారి వివాదంగా మారడంతో సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. 

More Telugu News