kanche ilaiah: నరుకుతాం అంటూ హెచ్చ‌రిక‌లు చేశారు: ప‌్రొ.కంచ ఐల‌య్య‌

  • కింది కులాల వారిపై దాడులు జరిగినప్పుడు బీజేపీ స్పందించ‌దు
  • సర్వ‌మానవ సమానత్వానికి బీజేపీ వ్యతిరేకం
  • కోరుట్లలో నాపై దాడి చేశారు.. నినాదాలు చేశారు

'సామాజిక స్మ‌గ్ల‌ర్లు కొమ‌టోళ్లు' అంటూ పుస్త‌కం రాసి క‌ల‌క‌లం రేపిన ప్రొ.కంచ ఐల‌య్య‌పై ఆర్య‌వైశ్యులు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్య‌వైశ్యులు త‌న‌పై దాడులు చేస్తున్నార‌ని, ఆ దాడుల‌ను చేయిస్తోంది భార‌తీయ జ‌నతా పార్టీనేన‌ని కంచ ఐల‌య్య‌ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్‌ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐల‌య్య మాట్లాడుతూ... కింది కులాల వారిపై దాడులు జరిగినప్పుడు మాత్రం బీజేపీ స్పందించ‌బోద‌ని చెప్పారు.

దేశంలోని న్యాయవ్యవస్థను, పోలీసులను, రాజ్యాంగాన్ని ఆ పార్టీ స‌రిగ్గా పనిచేయనివ్వడం లేదని కంచ ఐల‌య్య‌ ఆరోపించారు. సర్వ‌మానవ సమానత్వానికి బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. తాము అన్ని చోట్ల తిరుగుతూ రైతుల‌ సమస్యలను తెలుసుకుంటున్నామ‌ని, వారిని దోచుకుంటున్న వ్యాపారుల అక్రమాల గురించి గ‌ళం విప్పుతున్నామ‌ని తెలిపారు. తాను కోరుట్లలో మీడియాతో మాట్లాడుతుండగా త‌న‌పై దాడికి పాల్పడ్డారని, త‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశార‌ని చెప్పారు. 'అడ్డంగా నరుకుతాం' అంటూ హెచ్చ‌రిక‌లు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News