tharun bhaskar: నన్ను నేను తాకట్టు పెట్టుకుని అప్పుతెచ్చి ఆ సినిమా చేయాలనిపించింది: నిర్మాత రాజ్ కందుకూరి

  • తరుణ్ భాస్కర్ కథ చెప్పడానికి వచ్చాడు 
  • అదే సమయంలో విజయ్ దేవరకొండ వచ్చాడు 
  • ఇద్దరూ చెప్పాలనుకున్నది ఒకటే కథ .. అదే 'పెళ్లి చూపులు'  

"మీరు ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో వున్నారు .. అలాంటి సమయంలో మిమ్మల్ని తరుణ్ భాస్కర్ కలిసి .. 'పెళ్లిచూపులు' సినిమాను నిర్మించమని కోరాడు. అప్పుడు ఏ ధైర్యంతో మీరు అందుకు సిద్ధపడ్డారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నిర్మాత రాజ్ కందుకూరికి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ " ఒక రోజున నా స్నేహితుడొకరు ఫోన్ చేసి, విజయ్ దేవరకొండ దగ్గర ఒక కథ ఉందట .. వినమని చెప్పాడు. అదే రోజు సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి .. సార్ నా పేరు తరుణ్ భాస్కర్ .. అంటూ పరిచయం చేసుకున్నాడు. తన దగ్గర ఒక కథ ఉందని చెప్పడంతో .. ఫలానా రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను".

"తరుణ్ భాస్కర్ కథ చెప్పడం మొదలు పెట్టగానే .. విజయ్ దేవరకొండ వచ్చాడు. తరుణ్ భాస్కర్ కథ విన్నాక నీ కథ వింటాను అని విజయ్ తో చెప్పాను. ఇద్దరం చెప్పడానికి వచ్చింది ఒకే కథ సార్ .. అంటూ నవ్వేశారు. వాళ్లు చెప్పిన కథ విన్న తరువాత నన్ను నేను మరిచిపోయాను. అది ఎలాంటి  స్క్రీన్ ప్లే అంటే, నా దగ్గర డబ్బు లేకపోయినా ఎదుటివాళ్ల దగ్గర నన్ను నేను తాకట్టు పెట్టుకుని అప్పుతెచ్చి చేయాల్సిన సినిమా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News