Alien birds: ఆ వింత పక్షులకు ఆహారం పెడితే తినడం లేదు.. వాళ్లమ్మ తెచ్చిందే తింటున్నాయి!

  • వైజాగ్ వన్ టౌన్ లో వింత పక్షులు
  • ఏలియన్ లుగా సోషల్ మీడియాలో వైరల్
  • ఆహారం పెడుతున్నా తినని పక్షులు.. తల్లి తెచ్చిన ఆహారం మాత్రమే తింటున్న వైనం 

విశాఖలో మూడు పక్షులు కనిపించాయని, అవి గ్రహాంతరవాసుల్లా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ పక్షులకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పక్షుల ఉనికి ఎలా వెలుగులోకి వచ్చిందన్న విషయాన్ని వీటిని చూసిన వారు వెల్లడించారు. వైజాగ్ వన్ టౌన్ లో పాత పోస్టాఫీసుకు దగ్గర్లో పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఒడిశా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ అనే షిప్పింగ్ కంపెనీ ఉంది. ఆ కార్యాలయం నుంచి దుర్వాసన రావడంతో... ఆ కంపు భరించలేక, ఎక్కడ ఎలక చచ్చిందోనని వెతకడం ప్రారంభించారు.

దీంతో వారికి బాత్రూమ్ పైనున్న రూఫ్ మీద, శ్లాబు కింద చిత్రమైన పక్షులు కనిపించాయి. మొదట వాటిని గుడ్లగూబలుగా భావించారు. అయితే, వాటికంటే పెద్దగా ఉండడంతో పాటు, కాళ్లతో శబ్దం చేయడాన్ని గమనించి, ఇవేవో వింతగా ఉన్నాయే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఏలియన్ పక్షులంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ సంస్థ జనరల్ మేనేజర్ జేకే నాయక్ వాటికి పళ్లు, కాయగూరలు తెచ్చిపెట్టడం ప్రారంభించారు. అయితే అవి వాటిని ముట్టడం లేదు. బాత్రూమ్ కి ఉన్న రంధ్రంలోచి ఆ పక్షుల తల్లి బయటకు వెళ్లి ఏదో ఆహారం తెస్తోందని, దానిని మాత్రమే అవి తింటున్నాయని ఆయన తెలిపారు.

More Telugu News