Jagan: మహిళా సదస్సులో హామీల జల్లు కురిపించిన జగన్!

  • టీడీపీ పాలనలో మహిళల ఆర్థిక స్థితి దెబ్బతింది
  • ప్రతి తల్లి అకౌంట్ లోకి రూ. 15 వేలు
  • ఫీజు రీయింబర్స్ మెంటుతో పాటు.. హాస్టల్ ఫీజు రూ. 20 వేలు ఇస్తాం

ఈ మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మహిళల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో నిర్వహించిన మహిళల సదస్సులో ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాలకు రుణాలను మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోవడంతో మహిళలు మనోవేదనకు గురయ్యారని అన్నారు. చంద్రబాబు వైఖరితో డ్వాక్రా మహిళలు బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మిగిలారని, వారికి లోన్లు వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఎన్నికలు అక్టోబర్ లో వస్తాయని చంద్రబాబే చెబుతున్నారు... ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పు వస్తుందని అన్నారు.

ఇచ్చిన హామీలలో చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేదని... బెల్టు షాపులను ఎత్తేస్తామన్న చంద్రబాబు మద్యం అమ్మకాలను మరింత పెంచారని, దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై టీడీపీ వెనకడుగు వేసిందని... తమ మేనిఫెస్టోను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, మహిళలు గర్వంగా బతికేలా రూపొందిస్తామని చెప్పారు.

 'అమ్మ ఒడి' స్కీమ్ కింద ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి రూ. 15వేలు నేరుగా వెళ్లేలా చేస్తామని... దీంతో ఇద్దరు పిల్లలను స్కూల్లో చదివించవచ్చని తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని... దీనికి తోడు హాస్టల్ ఖర్చుల కోసం రూ. 20వేలు ఇస్తామని చెప్పారు. పెన్షన్ ను రూ. 2వేలకు పెంచుతామని... వెనకబడిన తరగతులు, మైనార్టీల వయసు పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శులను నియమిస్తామని... ప్రతి ఒక్కరికీ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు.

More Telugu News