WEF: 'ప్రజలు నమ్మిన ప్రభుత్వం' వరల్డ్ టాప్-3గా ఇండియా

  • ఓఈసీడీ తాజా సర్వేలో మోదీ సర్కారు ర్యాంకు
  • తొలి రెండు స్థానాల్లో స్విట్జర్లాండ్, ఇండొనేషియా
  • 74 శాతం మంది భారతీయులకు మోదీపై నమ్మకం
  • వివరాలు వెల్లడించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్

ఇండియాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారన్న విషయమై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన తాజా సర్వేలో మోదీ సర్కారు టాప్-3 స్థానాన్ని దక్కించుకుంది.

 ఈ సర్వే ఫలితాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేస్తూ, "ప్రజలు అత్యధికంగా నమ్మిన ప్రభుత్వాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ఉంది. ఇండియాలోని మూడొంతుల మంది తమ దేశ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు. ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక విధానం, పన్ను సంస్కరణలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరో మెట్టు ఎక్కించాయి" అని కితాబిచ్చింది.

సుమారుగా 74 శాతం మంది భారతీయులు మోదీ ప్రభుత్వంపై నమ్మకముందని వెల్లడించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా, రెండో స్థానంలో ఇండొనేషియా నిలిచింది. ఇండియా తరువాత లక్సెంబర్గ్, నార్వే, కెనడా, టర్కీ, న్యూజిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ ల్యాండ్, స్వీడన్, డెన్మార్క్, ఆస్ట్రేలియాలు నిలిచాయి.

More Telugu News