producer nv prasad: తప్పు జరిగిందని అనడంలో సందేహం లేదు... జ్యూరీ తప్పు చేసింది: నిర్మాత ఎన్వీ ప్రసాద్

  • ఎన్నో నిబంధనలను జ్యూరీ అతిక్రమించింది
  • 'మనం'ను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం
  • ఇంత అల్లరికి కారణం జ్యూరీ సభ్యుల వైఖరే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో తప్పు జరిగిందని చెప్పడంలో సందేహం లేదని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జ్యూరీ తప్పు చేసిందని వ్యాఖ్యానించిన ఆయన, జ్యూరీ సభ్యులెవరూ ప్రెస్ ముందుకు రాకూడదని రూల్ ఉన్నా, దాన్ని అతిక్రమించారని విమర్శించారు.

గుణశేఖర్ బాధను అర్థం చేసుకోవాలని అన్నారు. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు కోసం దరఖాస్తు చేస్తే, ఆ అవార్డును ఇవ్వకుండా మరో అవార్డును ఇచ్చారని, అలా చేసేముందు తప్పనిసరిగా గుణశేఖర్ ను సంప్రదించాల్సిన జ్యూరీ అలా చేయలేదని విమర్శించారు. నటీనటులు చిత్రం నిర్మాణంలో పడే కష్టం గురించి జ్యూరీ సభ్యులకు తెలియదని అన్నారు.

చనిపోతూ కూడా నటించాలని కోరుకున్న అక్కినేని నాగేశ్వరరావు ఆఖరు చిత్రం 'మనం'ను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. జ్యూరీ చేసిన తప్పులకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అవార్డు ఎంపిక తరువాత, అధికారికంగా ప్రకటించేంతవరకు బయటకు చెప్పకుండా ఉండాల్సిన సభ్యులు, ముందే బయటకు చెప్పారని, అందువల్ల కూడా రచ్చ పెరిగిందని అన్నారు. ఆ అవార్డు ఇచ్చే బదులు బన్నీకి అసలు అవార్డు ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News